నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ కూడా చేరారు. చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడంతో గట్టిగా బదులివ్వలేకపోతున్న టిడిపి నేతలకు ప్రత్యామ్నాయంగా వేణుమాధవ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. “నాకు ఛానల్ లేదు, పేపర్ లేదని ఒకడు అంటున్నాడని… మరి ఆ ఛానల్ ఎవరిది, పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్?” అంటూ వ్యాఖ్యానించిన వేణు, తాను ఎవరినీ విమర్శించనని, విమర్శించే అలవాటు తనకు లేదని అన్నారు.
“నా బిడ్డలైన భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల గురించి విమర్శించిన వారి గురించి నేను మాట్లాడటమా… థూ… నీచం, నికృష్టం” అన్న ఈ నల్లబాలు, కర్నూలు నుంచి నంద్యాలకు ఒక గంటలో వచ్చేస్తానని అనుకున్నానని, కానీ చాలా సమయం పట్టిందని… అన్ని చోట్లా అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతున్నాయని… ఎక్కడ చూసినా ప్రొక్లైనర్లే కనిపిస్తున్నాయని పరోక్షంగా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేసారు వేణు.
ఇక చంద్రబాబు మాట్లాడుతూ… కేవలం అభివృద్ధి కోసమే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చారని, ఆయన చనిపోవడానికి ముందు రోజు కూడా తన వద్దకు వచ్చారని… అభివృద్ధి పనుల గురించే తనతో చర్చించారని… నంద్యాలలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. వైసీపీ నేతలకు అధికారం, డబ్బు కావాలని… ప్రజల సంక్షేమం వారికి పట్టదని, హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని… కట్టుబట్టలతో అమరావతికి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నానని… నంద్యాలను స్మార్ట్ సిటీగా మారుస్తానని తెలిపారు.