venu-madhav-about-his-death-rumours“తనకు కేన్సర్, బీపీ, షుగర్, అల్సర్ తదితర రోగాలున్నాయని, ఏ క్షణమైనా తెలుగు ప్రజలకు దూరమవుతానంటూ” సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కమెడియన్ వేణుమాధవ్ స్పందించారు. తను చనిపోయానంటూ కధనాలు ప్రసారం చేసిన మీడియా ఛానల్ పైన కేసు నమోదు చేసేందుకు పోలీసు స్టేషన్ కు గుండుతో వచ్చిన వేణుమాధవ్ వివరణ ఇచ్చుకున్నారు.

“ఇటీవల తానూ తిరుపతి వెళ్ళాలని, బాలయ్య గారి 100వ సినిమా, చిరంజీవిగారి 150 సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని భగవంతుడిని కోరుకున్నానని, ఆ మొక్కులో భాగంగా గుండు చేయించుకున్నానని, తనకు కాన్సర్ వంటి ఎలాంటి ప్రాణంతకమైన జబ్బులు లేవని” తెలిపిన మన ‘నల్లబాలు’ వేణుమాధవ్ ఒక మీడియా ఛానల్ ను ఉద్దేశించి మాత్రం తీవ్రంగా స్పందించారు.

“గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యం పాలైన వేణుమాధవ్ ఇక మనకు లేడు. నిమ్స్ ఆసుపత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్…” అంటూ నాపై ప్రచారం చేశారు. మరిప్పుడు మాట్లాడుతున్నది వేణుమాధవా? వాడి తమ్ముడా? వాడి బావమరిదా? ఎందుకిది? ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇది తేల్చాలని కేసు పెట్టడం కోసం కుషాయిగూడ స్టేషనుకు వచ్చాను. ఎవరెవరు చేశారో వారందరి పైనా కేసు పెట్టడం జరిగింది… అని తెలిపారు.