అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం ‘మనం’ విడుదల అయిన తర్వాత దగ్గుబాటి వారి ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. రామానాయుడు తన కొడుకు వెంకటేష్ మరియు మనవడు రానాతో కలిసి సినిమా చేయాలని చాలా ఆశ పడ్డారు. కాని ఆయన ఆశ తీరకుండానే కన్ను మూశారు. మూడు తరాల మల్టీస్టారర్ సాధ్యం కాకపోయినా నాన్నగారి కోరిక మేరకు వెంకటేష్, రానాలు హీరోలుగా ఒక సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా స్వయంగా నిర్మాత సురేష్బాబు ప్రకటించాడు. ఆ ప్రకటన వచ్చి చాలా కాలమే అయ్యింది. అయినా ఇప్పటి వరకు ఆ మల్టీస్టారర్ గురించిన ఊసే లేదు.
ఆ మధ్య రానా సైతం బాబాయితో ఒక సినిమా చేయాల్సి ఉంది, దానికి కథ రెడీ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాని ఇప్పట్లో ఆ మల్టీస్టారర్ వచ్చే అవకాశాలే కనిపించడం లేదు. అసలు వీరిద్దరి మల్టీస్టారర్కు కథ రెడీ అవుతుందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. వెంకటేష్ త్వరలో మారుతి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. మరో వైపు రానా వరుసగా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులు ఆ మల్టీస్టారర్ గురించి మరిచి పోవాల్సిందే. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.