నెల్లూరు జిల్లా, వెంకటగిరి నియోజకవర్గపు స్థానానికి ఎమ్మెల్యే అయినటువంటి కురుగొండ్ల రామకృష్ణతో ఓ ప్రముఖ మీడియా ఛానల్ వీకెండ్ ఇంటర్వ్యూని ప్రసారం చేసింది. రాజకీయ ప్రత్యర్ధులు, మీడియా వర్గాల్లో వెలువెత్తిన ఆరోపణల నేపధ్యంలో ప్రశ్నలు అడిగిన సదరు యాంకర్ కు రామకృష్ణ నుండి ఆగ్రహపూరితమైన స్పందనే వ్యక్తం కావడం విశేషం.
ప్రస్తుతం రోజుకు 10 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని అడిగిన ప్రశ్నకు… అది ఎవడు చెప్పాడో నిరూపించమనండి… చెప్పు తీసుకుని కొడతా… అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు ఈ టిడిపి నేత. నెలకు 10 కోట్లు వస్తే నేను ఈ పదవిలో ఉండను… నిజంగా 10 కోట్లు సంపాదిస్తే మీరు ఏది చెప్తే అది చేయడానికి తానూ సిద్ధమని అన్నారు. అలాగే మీ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల విషయంలో మీరు ఎందుకు ‘లంచాలు’ అడుగుతున్నారు? అని ప్రశ్నించగా…
‘ఏ …కొడుకు చెప్పాడు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే రామకృష్ణపై వచ్చిన ఇతర ఆరోపణలను అడుగుతున్న సమయంలో కూడా అదే స్థాయిలో ‘…కొడుకు చెప్పాడు, నిరూపించమనండి… వెంటనే రాజీనామా చేస్తా… నిరూపించండి’ అంటూ సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా ప్రజలు తెలివితేటలు ఉన్న వారని, నేను ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే… నన్ను రెండు సార్లు ఎందుకు గెలిపిస్తారు..? తన నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో నీటి పంపిణీ చేసిన వ్యక్తిని నేను అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.
లండన్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసానన్న వార్తల్లో నిజం లేదని, నేను లండన్ లో ఉన్న సమయంలో జగన్ స్కాట్లాండ్ లో ఉన్నాడని, ముందు రోజు అతనున్నాడు, తర్వాత రోజు నేను వెళ్ళాను, అది కూడా జగన్ వెళ్లాడన్న సమాచారం చెప్తే విన్నాను తప్ప తనకు తెలియదని… తానూ ఇష్టంగా కొలిచే పోలేరమ్మ సాక్షిగా చెప్తున్నాను అంటూ జగన్ ను కలిసిన అంశంపై వివరణ ఇచ్చారు. తానేంటో సిఎం చంద్రబాబు నాయుడు గారికి తెలుసని, తన మదిలో, తన రక్తంలో చంద్రబాబు, లోకేష్ బాబు తప్ప మరొకరికి తావు లేదని అన్నారు.
అలా సాగుతూ ఉన్న ఇంటర్వ్యూలో సదరు మీడియా ప్రతినిధి అడిగిన మరో ప్రశ్నతో కురుగొండ్ల రామకృష్ణ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజకీయ ప్రత్యర్ధులు ‘ఆంధ్రా వీరప్పన్’ అని పిలుస్తారు, ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధం లేదా..? అన్న ప్రశ్నకు… పోలేరమ్మ సాక్షిగా చెప్తున్నా… 2009లో ఎమ్మెల్యే అయ్యాను… అప్పటినుండి ఎర్రచందనం నియత్రించడానికి ప్రయత్నాలు చేశాను గానీ… అని వివరణ ఇస్తున్న సమయంలో… ‘మీకు నిజంగా ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధం లేదా?’ అని మళ్ళీ అడగడంతో ఆగ్రహించిన రామకృష్ణ… ఎదురుగా ఉన్న పూల మొక్కను నేలకేసి కొట్టి, అక్కడ నుండి వెళ్ళిపోయారు.