రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు రాష్ట్ర ప్రయోజనాలపై నోరు మెదపని వారు ఈ రోజు తమను విమర్శిస్తున్నారని పరోక్షంగా ‘జనసేన’ అధినేతను ఉద్దేశించి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆదాయం లేకపోతే ఏపీ వెనుకబడిపోతుందని, విభజన సమయంలో తాను రాజ్యసభలో చెప్పానని, ప్రత్యేక హోదా కావాలని అడిగింది నేనే, ఒప్పుకుంటున్నా… అయినా ఆ రోజు హోదా అడిగారు అంటూ విమర్శిస్తున్నారని, అసలు హోదా అడగడంలో తప్పేముంది? ఏపీ విడిపోతే రాష్ట్రానికి ఏం కావాలో అన్నీ అడగాలని తాను కాంగ్రెస్ నేతలకి చెప్పినా, వారు వినలేదని, అందరినీ మోసం చేసి పార్లమెంటులో విభజన బిల్లు పెట్టారని, రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని ఉద్ఘాటించారు.
లోక్ సభలో ఎవరు మాట్లాడినా వారిని బయటకు పంపేశారు, దూరదర్శన్ లైవ్ ఆపేశారు. ఎవరినీ మాట్లాడనివ్వకుండా చేశారు. 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. బిల్లు రాజ్యసభకి వచ్చేసరికి చూస్తూ ఊరుకోలేకపోయాను. నేను రాష్ట్రానికి హోదా కావాలని మాట్లాడాను. మొదటిసారిగా అద్వానీ దగ్గర కూడా గట్టిగా మాట్లాడాను… రాష్ట్రానికి న్యాయం జరగాల్సిందేనన్నాను. అందరి నేతలతో మాట్లాడాను. చట్టంలో ఎన్నో విషయాలు పొందపర్చాలని కోరా. ఏపీకి న్యాయం జరిగే వరకు ఎంతవరకయినా వెళతా… హోదా మాత్రమే కాదు, ఎన్నో అంశాలు అడిగా. అందులో అనుమానం ఏముంది..? పోలవరం ప్రాజెక్టు కడితే ముంపు గ్రామాలు మునిగిపోతాయని చెప్పాను. విభజన బిల్లులో రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే పలు అంశాలు పెట్టలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
లడ్డూలు పాచిపోవచ్చు… కానీ, డబ్బులు పాచిపోవు. కేంద్రం ఇచ్చిన డబ్బుని కొందరు పాచిపోయిన లడ్డూ అంటున్నారు, ఇంకేవేవో మాట్లాడుతున్నారు. హోదా అనే ఒక పదాన్ని పట్టుకొని మాకు అదే కావాలని మాట్లాడుతున్నారు. హోదాకు తగిన విధంగానే ప్రత్యేక సాయం అందిస్తామని స్పష్టం చేసినా అవే విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని, ఆ డబ్బంతా మళ్లీ కేంద్రమే కడుతుందనని స్పష్టంగా చెప్పినా, ‘మాకవన్నీ వద్దు’ అంటూ ‘మాకు హోదానే ఇవ్వండి’ అంటూ మాట్లాడుతున్నారు.
పోలవరానికి అవసరమయ్యే నిధులను 60 శాతం రాష్ట్రం, 40 శాతం కేంద్ర పెట్టుకోవాలి. హోదా వస్తే 90 శాతం కేంద్రం భరిస్తుంది. కానీ, ప్రత్యేక సాయాన్ని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు పోలవరానికి అవసరమయ్యే 100 శాతం నిధులని ఖర్చుపెడుతుందని వ్యాఖ్యానించారు. వెంకయ్య గారి వ్యాఖ్యలన్నీ బాగానే ఉన్నాయి గానీ, ఏపీకి ప్రయోజనకారి అయ్యే అంశాలను పొందుపరచని పక్షంలో విభజనకు అనుకూలంగా ఆనాడు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది పవన్ కళ్యాణ్ లాంటి వారు వేస్తున్న ప్రధాన ప్రశ్న. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వారు మోసం చేసారని చెప్తున్న వెంకయ్య నాయుడు గారికి, ప్రస్తుతం బిజెపి అవలంభిస్తున్న విధానాలు కూడా రాష్ట్ర ప్రజలకు అలాగే ఉంటున్నాయని గమనించకపోవడం విస్మయం కలిగించే విషయమే.