కేవలం ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా సంబంధం లేకుండా ప్రసంగాలు, విమర్శలు చేస్తారని అరుదైన కీర్తిని ఆర్జించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తాజాగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఓ డిమాండ్ చేసారు. కేంద్రం నుండి ‘స్పెషల్ ప్యాకేజ్’ తెప్పించినందుకు గానూ, చంద్రబాబు రాజీనామా చేయాలన్న నినాదాన్ని అందుకున్నారు. అయితే వైసీపీ పరిభాషలో చెప్పాలంటే… ప్రత్యేక హోదా తెప్పించనందుకు గానూ… సిఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ ఆరోపణలు, విమర్శలు చంద్రబాబుకు నిత్యం ఉండేవే కావడంతో వీటికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రం ఓ రేంజ్ లో వైసీపీని ఆడేసుకున్నారు. “చంద్రబాబు భయపడుతున్నారు… భయపడుతున్నారు… అని అంటున్నారు. అసలు చంద్రబాబు దేనికి భయపడాలి? ఇది నాకు అర్ధం కావట్లేదు! కేంద్ర సహాయ సహకారాలతో చంద్రబాబు కలిసి మెలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం సహకారం లేకుండా మనుగడ సాగించడం కష్టం… ఈ విషయం వారికి తెలుసా అసలు?” అంటూ సూటిగా ప్రశ్నించారు.
“ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న వారందరికీ కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడం కాదు, వాళ్లకు కావాల్సింది చంద్రబాబు దిగిపోతే… ఆ సిఎం హోదా కావాలని..!” అంటూ జగన్ తీరును ఏకరువు పెట్టారు. “అయితే ఆ హోదా ఇచ్చే అధికారం ప్రజల చేతుల్లోనే ఉంది. చంద్రబాబు రాజీనామా చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా? కేంద్ర నుండి టిడిపి బయటకు వస్తే ఆ అవకాశం మీకు వస్తుందని ఎదురు చూస్తున్నారా? పొత్తు అన్నది రెండు పార్టీలకు సంబంధించిన విషయం, మధ్యలో అడగడానికి మీరెవరూ? కుటుంబంలోనే కొన్ని సమస్యలు ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు” అంటూ కాస్త గట్టిగానే వైసీపే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వెంకయ్య నాయుడు.
ఇక్కడితో ఆగని వెంకయ్య… ఆ మధ్య ఒక మహానుభావుడు తనను విమర్శిస్తూ… ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే ఏపీలో అడుగుపెట్టనివ్వనని, పంచెలూడదీస్తాడట. అసలు పంచెలు ఊడదీసి చూడల్సిన ఆసక్తి ఏమిటో అర్ధం కావట్లేదు, ఆయనకు లేవా? అంటూ వెంకయ్య స్టైల్ చమత్కారాన్ని పండించారు. వ్యాఖ్యలు చేసేటపుడు కాస్త ఆలోచించుకుని మాట్లాడాలి, అసభ్య పదజాలంతో రాజకీయ స్థాయిని తగ్గిస్తున్నారని… ఆవేదన వెలిబుచ్చారు వెంకయ్య.