Sekhar-Kammula-Varun Tejమెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ సినిమాల శైలి అస్సలు మెగా కాంపౌండ్ తరహాలో సాగకపోవడం విశేషం. మెగా సినిమాలంటే ‘మాస్’ ఎలిమెంట్స్ తో అభిమానులను కట్టిపడేసే విధంగా ఉంటాయన్న నానుడి ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఇటీవల విడుదలైన ‘సరైనోడు, సుప్రీమ్’ చిత్రాలు కూడా ఈ కోవలోనే వచ్చి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే, నాగబాబు తనయుడు వరుణ్ మాత్రం వీటన్నింటికి భిన్నంగా కధలను ఎంచుకుంటున్నాడు.

బహుశా మరో మెగా హీరో అయితే ‘ముకుంద’ సినిమాతో ఎంట్రీ ఇచ్చేవారో తెలియదు గానీ, వరుణ్ మాత్రం ఆ సాహసం చేసిన శభాష్ అనిపించుకున్నారు. అలాగే క్రిష్ చిత్రం ‘కంచె’ ఎంపిక చేసుకుని, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే తర్వాత తనలోని మాస్ కోణాన్ని వెలికి తీయాలని భావించిన ‘లోఫర్’ ఏ మాత్రం రుచించకపోవడంతో మళ్ళీ తన పాత బాణీలోకి వచ్చి, మరో విలక్షణ దర్శకుడికి ఓటు వేసారు.

నాలుగైదేళ్ళకు ఒక సినిమాను తీసి, టాలీవుడ్ లో ‘స్పెషల్’ దర్శకుడిగా పేరు గాంచిన శేఖర్ కమ్ముల తన తాజా చిత్రాన్ని వరుణ్ తేజ్ తో తీయబోతున్నారు. దీనికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ మెగా కాంపౌండ్ ఇప్పటికే ఇచ్చేయడంతో అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా కధ ‘అమెరికా అబ్బాయి – తెలంగాణా అమ్మాయి’ మధ్య సాగుతుందని తెలుస్తోంది. పూర్తి ప్రేమకధా చిత్రంగా తెరకెకక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది.