వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. త్వరలో మరో సినిమా సినిమాతో వర్మ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఎటాక్’. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. దాదాపు ఆరు నెలలుగా ఈ చిత్రం విడుదల అవ్వకుండా ల్యాబ్లోనే పడి ఉంది. ఇప్పటికి ఈ చిత్రానికి మోక్షం రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మంచు ఫ్యామిలీతో వర్మ తీసిన ‘రౌడీ’ మరియు ‘అనుక్షణం’ చిత్రాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. దాంతో ఈ సినిమాపై కూడా వర్మ అభిమానుల్లో ఆసక్తి ఉంది. ఈ చిత్రానికి వర్మ కాస్త వైవిధ్యంగా ఎక్కువ బడ్జెట్ను ఖర్చు చేశాడు. ఒక ఫైట్ను ఏకంగా కోటి రూపాయు ఖర్చు చేసి మరీ వర్మ తెరకెక్కించినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. దాంతో ‘ఎటాక్’పై అంచనాలు పెరిగాయి.
ఇక ఈ చిత్రంలో తారాగణం కూడా భారీగానే ఉంది. మంచు మనోజ్కు జోడీగా ‘బీరువా’ ఫేం సురభి హీరోయిన్గా నటించిన విషయం తెల్సిందే. ఇక ఇదే చిత్రంలో జగపతిబాబు మరియు ప్రకాష్ రాజ్లు సైతం నటించారు. వీరిద్దరికి చాలా ముఖ్య పాత్రలను వర్మ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మనోజ్ పెళ్లికి ముందు ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కాని ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఆడియోను ఫిబ్రవరి 5న విడుదల చేసి ఆ వెంటనే చిత్రాన్ని సైతం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.