నిన్న రాత్రి బెంజ్ సర్కిల్ వద్ద చంద్రబాబు నాయుడు ఇతర నేతలను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో కాసేపు హై డ్రామా నడించింది. చంద్రబాబుని అరెస్టు చేసిన వార్త టీవీలలో రావడంతో అక్కడకు టీడీపీ నేతలు, క్యాడర్, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీనితో చేసేది ఏమీ లేక కాసేపటికి పోలీసులు ఆయనను ఆయన ఇంటి వద్ద వదిలిపెట్టారు.
ఇది ఇలా ఉండగా కొంత కాలంగా ఆజ్ఞతంలో ఉన్న వంగవీటి రాధ ఎట్టకేలకు బయటకు వచ్చి చంద్రబాబు, లోకేష్ లను మద్దతుగా నిలబడ్డారు. జగన్ తో విభేదించి ఎన్నికల ముందు టీడీపీలో చేరారు రాధ. ఎన్నికలలో పోటీ చెయ్యకుండా పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు.
అయితే టీడీపీ ఓటమితో ఆయన కొంత కాలం బయటకు రాలేదు. దీనితో ఆయన మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారని వార్తలు కూడా వచ్చాయి. ఆయనకు సన్నిహితుడు మంత్రి కొడాలి నాని ఆయనతో మంతనాలు జరుపుతున్నారని కూడా వినిపించింది. అయితే ఆయన ఉన్నఫళంగా టీడీపీ క్యాంపులో కనిపించడంతో ప్రస్తుతానికి అనుమానాలు అన్నీ తొలగిపోయాయి.
స్థానిక ఎన్నికల ముందు టీడీపీకి ఇది మంచి పరిణామమే. ఇది ఇలా ఉండగా నిన్న పోలీసులు అడ్డుకున్న ప్రదేశం నుంచే చంద్రబాబు అమరావతి జేఏసీ నేతలతో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబు నేతృత్వంలో బెంజ్ సర్కిల్ నుంచి జేఏసీ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు. మచిలీపట్నం కోనేరు సెంటర్లో మధ్యాహ్నం బహిరంగ సభ లో చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే కాకినాడ, ఒంగోలులోనూ చైతన్య సభలు నిర్వహించనున్నట్లు అమరావతి పరిరక్షణ కమిటీ వెల్లడించింది.