సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ప్లాన్ చేసిన సినిమా ఇప్పుడు అటకెక్కింది. మహర్షి తరువాత వంశీ ఎటువంటి సినిమా చెయ్యకుండా మహేష్ కోసమే వేచిచూశాడు. ఈ తరుణంలో వంశీ చెప్పిన కథ నచ్చలేదని మహేష్ ఆ ప్రాజెక్టు కాదు అన్నాడు. దీనితో వంశీ పని అయిపోయిందని అంతా భావించారు.

అయితే అనుకోకుండా అదృష్టం వంశీ ఇంటి తలుపు తట్టినట్టుగా అయ్యింది. చిరంజీవి లూసిఫర్ రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టుకి ఇప్పుడు వంశీని అనుకుంటున్నారట. మొన్న ఆ మధ్య ఆయన ఊపిరిని సక్సెస్ ఫుల్ గా డైరెక్ట్ చేశారు. అది కూడా ఒక రీమేక్ సినిమానే.

దీనితో వంశీ కెరీర్ కు ఇది లైఫ్ లైన్ అనే చెప్పుకోవాలి. చిరంజీవి – కొరటాల శివ క్రేజీ కాంబో మూవీ ఆగస్టులో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. దీనితో వంశీకి ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి కావాల్సినంత టైం ఉంటుంది.

లూసిఫర్ రీమేక్ కు మొదట్లో పరశురామ్ ని అనుకున్నారు. అయితే ఇప్పుడు అతనికి మహేష్ బాబుని డైరెక్టు చేసే అవకాశం రావడంతో ఆ అవకాశం వంశీ పైడిపల్లికి వెళ్ళింది. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే… వంశీ చెయ్యాల్సిన మహేష్ బాబు సినిమా కు పరశురామ్ కి వెళ్లినట్టు అయ్యింది. అంటే ఒకరకంగా ఒకరికొకరు ప్రాజెక్టులు మార్చుకున్నట్టు అయ్యింది.