మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా విడుదలకి కొన్ని గంటల ముందు చిత్రబృందానికి, మెగా అభిమానులకు షాక్ తగిలింది. సినిమాను అనంతపురం జిల్లాలో ప్రదర్శించకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా టైటిల్ తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ వారు ఆరోపిస్తున్నారు.
ఇటీవల సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దీనితో ఆ కేసు ఎటు తేలలేదు. అయితే వాల్మీకులు ఎక్కువ ఉండే అనంతపురం జిల్లాలో ఈ సినిమా విడుదల అయితే శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఇప్పుడు చిత్రబృందం అక్కడ సినిమా విడుదల కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి.
గతంలో అనంతపురంలో ఈ చిత్ర షూటింగ్ అనుకున్నప్పుడు కూడా స్థానికులు షూటింగ్ జరగకుండా అడ్డుకున్నారు. వాటిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వాల్మీకి చిత్రం సీడెడ్ లోని మాస్ ప్రేక్షకులను బాగా ఆకర్షించే అవకాశం ఉంది. సీడెడ్ లో ప్రధానమైన అనంతపురం జిల్లాలో సినిమా విడుదల కాకపోతే ఓపెనింగ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గత నాలుగు చిత్రాలలో మూడు హిట్లు ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు.