వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ నాయకులను రాయలేని భాషలో తిట్టేశారు. కనీసం చంద్రబాబు వయసుకు కూడా మర్యాద ఇవ్వలేదు. వంశీ టీడీపీ టిక్కెటు పై రెండు సార్లు గెలిచారు. వంశీ చేరికతో ఆ నియోజకవర్గంలోని బలమైన నాయకులందరూ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయినట్టు అయ్యింది.
దాసరి కుటుంబం ఎన్నికలకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరింది. గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా ఆర్ధికంగా బలమైన అభ్యర్ధే. ఇప్పటికిప్పుడు ఉపఎన్నిక జరిగితే టీడీపీకి స్థానికంగా నాయకుడు కూడా లేని పరిస్థితి. ఈ తరుణంలో వంశీ ఉపఎన్నికకు వెళ్లి గెలిచి వస్తే అది ఆయన హీరోయిజంను జగన్ హీరోయిజం ను పెంచేదే.
పైగా ఉపఎన్నికలలో సహజంగా అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది. అయినా వంశీ ఆ సాహసం చెయ్యడం లేదు. లోకేష్ ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తా అంటూ వితండవాదం చేస్తున్నారు. రాజీనామా చేస్తే మళ్లీ గెలవనని భయపడుతున్నారా..? అనే విమర్శలు సహజంగానే ప్రారంభమయ్యాయి.
అయితే వంశీకి వైఎస్సార్ కాంగ్రెస్ పై నమ్మకం లేకపోవడమే దీనికి కారణం అంటున్నారు. “వంశీ రాజీనామా చేస్తే మళ్ళీ టిక్కెటు ఇస్తారనే నమ్మకం లేదు. పైగా నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, క్యాడర్ తో వంశీకి విబేధాలే. ఈ తరుణంలో ఉపఎన్నికలకు వెళ్తే వారంతా కలిసి ఓడించవచ్చు అని వంశీ భయం. పైగా వంశీ వైఖరితో స్థానికంగా ఆయన సామజిక వర్గం వారు కూడా వ్యతిరేకంగా మారారు. ఈ తరుణంలో ఆయన రిస్క్ తీసుకోదల్చుకోలేదట.