Vakkantham Vamsi Allu Arjunవరుసగా ‘సమ్మర్ సక్సెస్’ లు కొడుతూ “దువ్వాడ జగన్నాధమ్” సినిమాతో దానికి బ్రేక్ వేసిన అల్లు అర్జున్, తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” అనే సినిమాలో నటిస్తున్నాడు. రచయితగా ‘సూపర్ హిట్’ సినిమాలను అందించిన వక్కంతం వంశీ, తొలిసారి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మరియు పోసాని కృష్ణమురళీల నడుమ కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నారు.

ఇలా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేసే పనిలో ఉన్న అల్లు అర్జున్, తన తదుపరి చిత్రాన్ని కూడా కొత్త దర్శకుడు చేతిలో పెట్టబోతున్నారనేది లేటెస్ట్ రూమర్. ఆ డైరెక్టర్ పేరేంటో బయటకు రాలేదు గానీ, ఇటీవల బన్నీని కలిసిన ఓ కొత్త డైరెక్టర్ ఓ ప్రేమకధను వినిపించారని, ఆ లైన్ బన్నీకి కూడా బాగా నచ్చేసిందని, దీంతో వెంటనే డెవలప్ చేయమని చెప్పారని, అన్నీ అనుకున్నట్లు కుదిరితే అల్లు అర్జున్ నటించబోయే తదుపరి సినిమా ఇదే అవుతుందన్నది టాలీవుడ్ వర్గాల సమాచారం.

నిజానికి ‘నా పేరు సూర్య’ తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇటీవల ‘స్పైడర్’ ఫలితం చవిచూసిన తర్వాత, టాప్ స్థాయిలో ఉన్నా తమిళ దర్శకుల జోలికి వెళ్ళడం కంటే, కొత్తవాళ్లైనా తెలుగు దర్శకుల చేతిలోనే తమ సినిమాలు పెట్టడం శ్రేయస్కరమని బన్నీ ఆలోచనలు చేస్తున్నారట. ఇది కార్యరూపం దాల్చితే, వరుసగా రెండు సినిమాలు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చిన అగ్ర హీరోగా కొన్ని సంవత్సరాల పాటు బన్నీ నిలిచిపోతాడని చెప్పడంలో సందేహం లేదు.