బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే అపప్రధ ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్నా మరో కురువృద్ధుడు వాజ్పేయీకి మాత్రం ఆయన ఘనమైన నివాళి అర్పించారు అనే చెప్పుకోవాలి. మోడీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే వాజ్పేయీ కి భారత రత్న ఇప్పించారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి రాష్ట్రపతి వాజ్పేయీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారం అందించారు.
మరణాంతరం కూడా మోడీ వాజ్పేయీ పై ఎనలేని ప్రేమ చూపించారు. అశేష జనవాహిని నడుమ భాజపా ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రీయ స్మృతిస్థల్కు వాజ్పేయీ అంతిమయాత్ర కొనసాగింది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో దిల్లీ వీధులు కిక్కిరిశాయి.
నాలుగు కిలోమీటర్లు సాగిన ఆత్మీయ నేత అంతిమయయాత్రలో ప్రధాని మోదీ, అమిత్షా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడణవీస్ కాలినడకన పాల్గొన్నారు. అంతిమ యాత్ర సాగుతున్నంతసేపూ అటల్ జీ అమర్ రహే నినాదాలు మార్మోగాయి. ప్రధాని అయ్యుండి కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయనను చివరి దాకా సాగనంపారు.