మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే అరడజను మంది హీరోలు బాక్స్ ఆఫీసు వద్ద తమ సత్తా చూపిస్తున్నారు తాజాగా మరో హీరో చిరంజీవి మేనల్లుడు (సాయిధరమ్ తేజ్ తమ్ముడు) పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే సినిమాతో తెరంగేట్రం చెయ్యబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.
సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సినిమా రూపొందుతుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. రేపటి నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ను పూరితో పాటు కోల్కతా, గ్యాంగ్టక్ ప్రాంతాల్లో జరపనున్నారు.
20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హీరో, హీరోయిన్లతో పాటు బ్రహ్మాజీ మీద కూడా కొన్ని కీలక సీన్లు షూట్ చెయ్యబోతున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే ఇప్పటివరకూ నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ప్రకటించలేదు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తొలి చిత్రంలో వైష్ణవ తేజ్ ఒక మత్స్యకారుడిగా కనిపిస్తాడని వదంతులు వినిపిస్తున్నాయి. నిజమైతే గనుక మొదటి సినిమాకే కొంచెం కఠినతరమైన పాత్రను ఎన్నుకున్నాడని చెప్పవచ్చు.