ఒకప్పుడు చంద్రబాబు హయాంలో వ్యవసాయ మంత్రిగా పని చేసి వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆ తరువాతి కాలంలో రాజకీయాలకు దూరమై గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేశారు. మూడు పంటలు పండే భూములలో రాజధాని వద్దూ అని ఆయన అప్పట్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేశారు.
అప్పట్లో ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి? అనే పుస్తకం కూడా వడ్డే కే అంకితం ఇచ్చారంటే అప్పటి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల తరువాత ఏమైందో ఏమో గానీ వైఎస్సార్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా అమరావతి తరలింపుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆర్టికల్ 245 ప్రకారం పార్లమెంట్ ఆమోదించిన బిల్లే అమరావతిని కాపాడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ హయాంలో వేల ఎకరాలు కొన్నారని, ఇప్పుడు జగన్ కోసం విజయసాయి రెడ్డి మరింత భూసేకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పైగా 13 జిల్లాల రైతుల మద్దతు కూడగట్టి రాజధానికి సంఘీభావంగా రైతు రక్షణ యాత్ర కూడా చేపడతారట. వడ్డేలో ఏ మార్పు ఎందుకో? జగన్ తనకు ఎటువంటి నామినేటెడ్ పదవి ఇవ్వని క్రమంలో వడ్డే ఎదురుతిరిగారని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ఆరోపించడం విశేషం.