v-hanumantha-rao-posani-fightపోసాని కృష్ణ మురళీ… పెద్దగా పరిచయం చేయాల్సిన పేరు కాదు. ఎవరి మీద అయినా నిర్మొహమాటంగా మాట్లాడడంలో పోసాని స్టైలే వేరు. అలాంటి పోసాని తాజాగా ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాలుపంచుకున్నారు. ఇండియాపై పాకిస్తాన్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి చర్చ జరుగుతుండగా.., భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికేత్తేస్తూ పోసాని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సందర్భంలో… వామపక్షాలను నిందిస్తూ… మీ జ్యోతిబసు రైతుల మీద నిర్ధాక్షణ్యంగా లాఠీచార్జి చేయవచ్చు గానీ, మన దేశం మీదకు వస్తే పాకిస్తానీయులను తిప్పికొట్టడం తప్పా? అంటూ నారాయణను నిలదీసారు.

తనకు తెలిసినంత వరకు మోడీ దేశంలోనే ఒక హానెస్ట్ పర్సన్ అని, తానేమీ బిజెపి నాయకుడిని కాదు, ఉన్నదేదో చెప్తాను, పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ అమ్మకు చీర పెట్టి, కాళ్ళకు దండం పెట్టిన మోడీ, మన దేశ రక్షణ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎందుకు విభేదిస్తారని, ఎంతసేపు మన సైనికులే చనిపోవాలా? అంటూ ప్రసంగిస్తున్న సమయంలో… కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కల్పించుకుని పోసాని వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదించారు. అలాగే సీపీఐ నారాయణ కూడా పెదవి విప్పారు. ఇలా గందరగోళంగా మారుతున్న తరుణంలో… యాంకర్ అందరినీ చల్లార్చగా… పోసాని ఈ సందర్భంగా ప్రత్యర్ధి నాయకులపై సెటైర్లు వేసారు.

‘మీరు మాట్లాడినపుడు నేను మాట్లాడలేదు, అలా మాట్లాడడానికి నేనేమి పిచ్చి కుక్క కాదు, నేను చదువుకున్న వాడ్ని, ఎస్… నాకు మోడీ అంటే ఇష్టం… నా ఇష్టాన్ని కాదనే హక్కు ఎవడికీ లేదు… అంటున్న తరుణంలో వీహెచ్ మళ్ళీ కల్పించుకోవడంతో… పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. వీహెచ్ సీట్లో నుండి లెగుస్తూ ఏవో మాట్లాడుతుండగా… సహనం కోల్పోయిన పోసాని… నీయమ్మా… అంటూ తిట్టడం లైవ్ లో స్పష్టంగా వినపడింది. దీంతో ఒక్కసారిగా అవాక్కైన సదరు టెలివిజన్ ‘లైవ్’ను కట్ చేసింది. సహజంగానే పోసాని ‘షార్ట్ టెంపర్’ అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. దానికి అనుగుణంగానే ఈ ‘లైవ్’ కార్యక్రమంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.