ఇటీవలే జరిగిన ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ లో ఇప్పుడు కేబినెట్ ర్యాంకు పదవైనా ప్రతిపక్షనేత పదవికై గట్టిగా లాబీయింగ్ జరుగుతుంది. పిసిసి అద్యక్షుడుగా ఉత్తం కుమార్ రెడ్డి కొనసాగితే , సిఎల్పి పదవి మల్లు భట్టి విక్రమార్కకు దక్కవచ్చని ఒక అంచనా. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాకు చెందినవారు కావడం, ఏడుగురు ఎస్.సి ,ఎస్టి ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఆయనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. దళితుడైన ఆయనను సిఎల్పి లీడర్ గా చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆ వర్గం ఓట్లు కాంగ్రెస్ కు గంపగుత్తుగా పడతాయని పార్టీ అంచనా.
ఉత్తం కుమార్ రెడ్డి కూడా సిఎల్పి నాయకత్వంపై దృష్టిపెట్టారని అంటున్నారు.మరో వైపు కోమటిరెడ్డిరాజగోపాలరెడ్డి పిసిసి,సిఎల్పి పదవులకోసం డిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు.ఏదో ఒకటి అయినా తగలకపోతుందా అన్నది ఆయన ఆశ అట. అయితే ఉత్తమ్ ను కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉందని అదే సమయంలో ఉత్తమ్ కు గానీ అదే సామజిక వర్గానికి చెందిన మరొకరికి గానీ ఇవ్వరని సమాచారం. డి.శ్రీధర్ బాబు, సబిత, జగ్గారెడ్డి వంటి వారు కూడా ప్రతిపక్ష నేత పదవి పై ఆశలు పెట్టుకోగా వారిపై కొన్ని కేసులు ఉన్నందున వారు రేసులో ఉండకపోవచ్చని అంటున్నారు.
అయితే కాంగ్రెస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పై తెరాస వల వేస్తుంది అని వస్తున్న వార్తలు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అదే జరిగితే కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. అదే క్రమంలో అప్పోజిషన్ లీడర్ పదవి కూడా పోతుంది. 119 స్థానాలు గల తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కేవలం 19 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచింది. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 12 స్థానాలు దక్కాలి. 10 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరితే కాంగ్రెస్ కు కేవలం 9 మందే మిగులుతారు. అంటే దాదాపుగా సీనియర్ మాత్రమే మిగులుతారు.