ఇటీవలే జరిగిన సాధారణ ఎన్నికల తరువాత తెలంగాణలో మొట్టమొదటి ఉపఎన్నికలకు నగారా మోగింది. అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నిక అవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది.
ఇప్పటికే ఆయన తన భార్య పద్మావతి పేరును అభ్యర్దిగా ప్రకటించి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడం కాంగ్రెస్ లో వివాదంగా మారింది. దీనితో కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఈ ఉప ఎన్నిక అటు తెరాస కు,ఇటు కాంగ్రెస్ కు, మధ్యలో బిజెపి కి కూడా ప్రతిష్టాత్మకమే అవుతాయి. అక్టోబర్ 21 న పోలింగ్, 24న కౌంటింగ్ జరుగుతుంది. ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్, తమ సత్తా చాటడానికి బీజేపీ ఆసక్తిగా ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణపై తమ పట్టు ఏ మాత్రం సడలలేదు అని చెప్పడానికి తెరాస ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కాగా మహారాష్ట్ర, హర్యానాల కు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాలలోను అక్టోబర్ ఇరవై ఒకటిన పోలింగ్ జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్నవే. ఇటీవలే సాధారణ ఎన్నికలలో ఘనవిజయంతో ఈ రెండు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి రావాలని కమలనాథులు ఆరాటపడుతున్నారు.