ఉజ్వల భవిష్యత్తు ఉన్న శక్తివంతమైన సంపన్నుల జాబితాలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధులకు స్థానం లభించింది. వ్యాపారం, వాణిజ్యం, నటన, క్రీడలకు సంబంధించి, ఇండియాకు చెందిన 22 మంది యువ శక్తివంతుల జాబితాను ‘టైకూన్స్ ఆఫ్ టుమారో’ పేరిట ‘ఫోర్బ్స్ ఇండియా’ విడుదల చేసింది.
ఈ జాబితా తయారీలో వారి వారి నికర సంపదను ప్రామాణికంగా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చిన ‘ఫోర్బ్స్’, ఆయా రంగాల్లో వారు చూపుతున్న ప్రతిభ, కుటుంబ వ్యాపారాలు, తొలితరం నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తల శక్తి సామర్థ్యాలు, ప్రస్తుతం వీరి వ్యాపకం తదితరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరణ్ అదానీ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఈడీ అనంత్ గోయెంకా, ఫ్యూచర్ కన్స్యూమర్ ఎండీ ఆశ్ని బియానీ, బిర్లా వారసురాలు, అనన్య బిర్లా తదితరులకు కూడా స్థానం లభించింది. వీరితో పాటు యస్ బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్, పార్లే ఆగ్రోకు చెందిన నదియా చౌహాన్, లోధా గ్రూప్ నకు చెందిన అభిషేక్ లోధా, క్లియర్ టాక్స్ ఫౌండర్ అర్చిత్ గుప్తా కూడా చోటు దక్కించుకున్నారు.