విభజనతో దగా పడ్డ ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి తెస్తాయని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే కూటమిలో నుంచి బయటకు రావడం బాధాకరమన్నారు. తెదేపా మళ్లీ ఎన్డీయేలోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీ అని.. ఎన్డీయేలో చేరాలని ఆ పార్టీ అధినేత జగన్ను ఆహ్వానిస్తున్నానని అన్నారు.
ఇదే సమయంలో జగన్ పై ఉన్న కేసుల సంగతి విలేకరులు గుర్తు చెయ్యగా “అవేమీ రుజువు కాలేదు కదా” అని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో ఇప్పటిదాకా అందరు అనుమాన పడుతున్న బీజేపీ వైకాపా పొత్తుపై ఊహాగానాలు మరింత పెరిగాయి. 2019 ఎన్నికలకు ముందే పొత్తుకు వెళ్తారా అనేది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.