విద్యుత్ సరఫరాకి దేశ జనాభా పెరుగుదలకి సంబందం ఉంటుందా? అంటే ఉందనే చెపుతున్నారు మన కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషీ. ఈ ఏడాది మే నెలలో బిజెపి పాలిత కర్ణాటక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్, బిజెపిలు అప్పుడే హోరాహోరీగా ఎన్నికల ప్రచారం ప్రారంభించేశాయి.
కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ హామీ అమలవుతోంది. ప్రభుత్వాలకు ఇది చాలా భారమే అయినప్పటికీ ఎన్నికలలో గెలిచేందుకు హామీ ఇచ్చినందున అమలు చేయాల్సివస్తోంది. ముక్కుతూ మూలుగుతూ అమలుచేస్తున్నా దీని గురించి గొప్పగా చెప్పుకొంటున్నాయి. కనుక ఇతర రాష్ట్రాలలో పార్టీలు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తున్నాయి. కాంగ్రెస్ కూడా అలాగే ఇచ్చింది. కనుక ఇది పెద్ద విచిత్రమేమీ కాదు. కానీ దీనిపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యాలే విచిత్రంగా ఉన్నాయి.
ఆయన కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తానని చెపుతోంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం కరెంట్ ఇచ్చేడే కాదు. ముఖ్యంగా గ్రామాలలో ఎప్పుడూ విద్యుత్ ఉండేది కాదు. అందుకే దేశ జనాభా ఇంతగా పెరిగిపోయింది,” అని అన్నారు.