గత కొంత కాలంగా జగన్ బెయిల్ రద్దు విషయంపై బాగా చర్చ జరుగుతుంది. అయితే సిబిఐ కోర్టు బెయిల్ రద్దు చెయ్యడానికి నిరాకరించడంతో అధికార పార్టీ రిలాక్స్ అయ్యింది. అయితే పట్టువిడవని రఘు రామకృష్ణరాజు హైకోర్టుకు, అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి బెయిల్ రద్దు చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తున్నారు.
జగన్ బెయిల్ రద్దయితే అది తమకు ఇబ్బంది అని.. ఎన్నికలు జగన్ పరిపాలన మీద కాకుండా బెయిల్, జైలు వంటి అంశాల మీద జరిగితే సెంటిమెంట్ కు అవకాశం ఉండవచ్చని టీడీపీ భావిస్తుంది. అందుకనే బెయిల్ రద్దు కాకపోవడమే మంచిది అనుకుంటుంది.
అయితే వైఎస్ వీరవిధేయుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం బెయిల్ రద్దు అనేది చాలా కీలక అంశమని, జగన్ కు జైలు కు వెళ్లినా ఇప్పుడు ఇస్తున్న తాయిలాలు ఆపేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పని అయిపోయినట్టే అని అంటున్నారు.
“వైఎస్సార్ కాంగ్రెస్ భవిష్యత్తు, గతం, వర్తమానం అంతా జగనే. జగన్ చూసే జనం ఓట్లు వేశారు. ఎవరు గెలిచినా జగన్ వల్లే. జగన్ జైలుకు వెళ్తే సీన్ మొత్తం మారిపోద్ది. నాయకుడు లేకపోతే పార్టీ మనుగడ కష్టం. పార్టీని కబళించడం ఖాయం,” అంటూ చెప్పుకొచ్చారు ఉండవల్లి.
గతంలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా చెల్లెలు షర్మిల పాదయాత్ర చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరికీ పెత్తనం కావాలి. ఆ పరిస్థితులు వైఎస్సార్ కాంగ్రెస్ కు మంచిది కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ను కబళించవచ్చు. బహుశా ఉండవల్లి అభిప్రాయం ఇదే కావొచ్చు.