పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా జనవరి 10వ తేదేన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తింపచేయడానికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఓ క్లారిటీ రాక ముందే తాజాగా ఈ పాట కోసం లోకల్ ముద్దుగుమ్మ ఉదయభానుతో చర్చలు జరుపుతున్నారని మరో వార్త పుట్టుకొచ్చింది.

జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన కరీనా నుండి ఒక్కసారిగా ఉదయభాను వైపుకు చూడడానికి కారణాలు ఏంటో గానీ… ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఎదురైన అనుభవం రీత్యా… చివరికి ఉదయభానునే ఫైనల్ అవుతుందేమోనన్న టాక్ బలంగా ఉంది. ‘అత్తారింటికి దారేది’ సినిమాకు గానూ బుల్లితెర సెన్సేషన్ ‘అనసూయ’ను సంప్రదించగా, ఆమె ‘నో’ చెప్పడంతో, ఆ తర్వాత ఆమె స్థానంలోకి హంసానంది వచ్చి స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. అప్పటిమాదిరే ఇప్పుడు కూడా బుల్లితెర బ్యూటీ ఉదయభాను పేరు తెరపైకి రావడం విశేషం.

అయితే అనసూయ మాదిరి ఉదయభాను ‘నో’ చెప్పకపోవచ్చని, అందులోనూ కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న నేపధ్యంలో… ఈ వార్త నిజమైతే ఖచ్చితంగా ఈ బుల్లితెర బ్యూటీ పవన్ తో స్టెప్పులు వేస్తుందని ట్రేడ్ వర్గాలలో బలంగా వినపడుతున్న టాక్. చాలాకాలం తర్వాత ఓ డ్యాన్స్ షో ద్వారా బుల్లితెరపై దర్శనమివ్వబోతున్న ఉదయభాను, సిల్వర్ స్క్రీన్ పై పవన్ పక్కన మెరిస్తే… ఆ గుర్తింపే వేరు కదా! గతంలో ‘లీడర్’ మరియు త్రివిక్రమ్ ‘జులాయి’ సినిమాలలో ఈ బ్యూటీ ఇలా ‘స్పెషల్’ సాంగ్స్ చేసిన దాఖలాలు ఉన్నాయి.