twist in singer madhupriya police case on her husband ఉన్నట్లుండి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన సింగర్ మధుప్రియ ఉదంతం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇద్దరూ కూడా ఎవరి వాదనలు వారు చెప్తూ… గందరగోళ పరిస్థితులకు దారి తీస్తున్నారు. ముందుగా తన భర్త శ్రీకాంత్ పై కేసు పెట్టిన మధుప్రియ వాదనను పరిశీలిస్తే…

తన భర్త శ్రీకాంత్ తనను తిట్టేవాడని, కొట్టేవాడని అంది. నా తండ్రి గానీ, నా తల్లి గానీ నన్నెప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. కానీ ఒక ఆడపిల్ల జీవితంలో ఆమె భర్త ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేదని, డబ్బు కోసమే శ్రీకాంత్ ఇలా తన పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నాడని, భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆరు నెలలక్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న తన సంసార జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అనుకోలేదని, నా తల్లితండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు నేనిప్పుడు బాధపడుతున్నానని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా శ్రీకాంత్ అతని స్నేహితులు సుమారు ఇరవై మంది తమ ఇంటిపై దాడి చేశారంటూ మధుప్రియ పేరెంట్స్ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంలో శ్రీకాంత్ స్నేహితుడైన ప్రేమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

మధుప్రియ గాధ ఇలా ఉంటే… భర్త శ్రీకాంత్ వ్యథ మరోలా ఉంది…

తన తల్లితండ్రుల వద్దకు వెళ్ళిన మధుప్రియతో మాట్లాడాలని తాను కోరగా, ఆసుపత్రి వద్దకు రావలసిందిగా ఆమె బంధువులు చెప్పారని, తానక్కడికి చేరుకోగానే మధుప్రియ బంధువులు తీవ్రంగా కొట్టారని, గాయాలకు గురైన శనివారం అర్ధరాత్రి ప్రముఖ మీడియా ఛానల్ కార్యాలయానికి చేరుకోగా, వారే ఆస్పత్రిలో చేర్పించారని తెలిపాడు. తనపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టామని తాజాగా వెల్లడించారు. అలాగే మధుప్రియ తనపై చేసిన ఆరోపణలు నిజమైతే తాను గొంతు కోసుకుంటానని, నిలువునా ప్రాణం తీసుకుంటానని, ఉరి శిక్షకు సిద్ధపడతానని, జైలుకు కూడా వెళ్తానని అన్నాడు. మధుప్రియ తల్లి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేత తన మీద దాడి చేయించిందని ఆరోపించాడు.

ఇలా ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ, మీడియాల వేదికగా ఎవరి వాదనలు వారు వినిపించుకుంటూ కేసును మలుపులు తిప్పుతున్నారు.