మలయాళ నటుడు కళాభవన్ మణి మృతి కేసులో ఉన్న రహస్యాలను చేధించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన శవపరీక్షలో ఇన్సెక్టిసైడ్స్ (క్రిమి సంహారకాలు), ఇథనాల్, మిథనాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటులు జాఫర్ ఇడుక్కి, థరికిదా సాభులతో పాటు కళాభవన్తో సన్నిహితంగా ఉండే మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు.
కళాభవన్ మణికి సంబంధించిన అత్యంత సన్నిహితులే విష ప్రయోగానికి పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతోనే వీరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే, దర్యాప్తు వివరాలను మాత్రం పోలీసు వర్గాలు బహిరంగంగా వెల్లడించడం లేదు. మణి మృతికి గల కారణాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఓ అధికారిక ప్రకటన చేస్తామని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి.
పోలీస్ వర్గాలు చేసిన ఈ తాజా ప్రకటనతో మణి మరణం సాధారణంగా జరిగింది కాదని, దీని వెనుక మరో కోణం ఉందన్న నిర్ణయానికి ప్రేక్షకులు వచ్చేసారు. దీంతో ఈ కేసు ఎన్ని మలుపులు తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న కళాభవన్ మణి (45) ఈ నెల 6న కొచ్చిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.