TRS Rajyasabha MP santosh kumar tested Corona positiveతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటీవలే కరోనా సోకింది. ఆయనకు దగ్గరుండి సపర్యలు చేశారు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్. నిన్న సీటీ స్కాన్ కోసం కేసీఆర్ నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు వచ్చినప్పుడు కూడా సంతోష్ ఆయన వెంటనే కనిపించారు. ఇప్పుడు ఆయన కరోనా బారిన పడ్డారు.

ఈ విషయాన్నిఆయనే తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో మంది అభిమానులు, పార్టీనాయకులు తనకు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు.

ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, ఇంట్లోనే ఉండాలని కోరారు. ఇకపోతే నిన్న ఆసుపత్రిలో కేసీఆర్, సంతోష్ ఇద్దరు సాధారణ మాస్కులు ధరించి కనిపించారు. కరోనా సోకినవారి వీలైనంతా దూరంగా ఉండాలని, అలా కుదరని పక్షంలో ఎన్95 మాస్కు, పీపీఈ కిట్లు ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

అలాగే కేసీఆర్ రక్షణ సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు… కేసీఆర్, సంతోష్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్య నిలకడగానే ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం నిన్న తెలిపిన సంగతి తెలిసింది.