trs-party-warangal-collections-talasani-srinivas-yadavవరంగల్ సభ నిధుల సమీకరణ కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలంతా గులాబీ కూలీలుగా మారారు. ఎవరికి నచ్చిన పనులను వారు చేస్తూ గంటల్లోనే లక్షల రూపాయల కూలీని సంపాదిస్తున్నారు. ఈ కూలి సంపాదనలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తం 16.50 లక్షల కూలీ సంపాదించి, టాప్ స్థానంలో నిలిచారు.

ఈ సంపాదన కోసం బోయిన్ పల్లి మార్కెట్లో మూటలు మోయడం, బేగంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో టైల్స్ మోయడం, సనత్ నగర్ లోని జెక్ కాలనీలో మట్టి మోయడం, హోటల్ లో చాయ్ అమ్మడం, ఓ టిఫిన్ సెంటర్ లో సర్వర్ గా పని చేయడం, రోడ్లను శుభ్రపరచడం, పుస్తకాలను విక్రయించడం, ఇసుక మోయడం, నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వాటర్ జోన్ లో టికెట్లను అమ్మడం, మోండా మార్కెట్ లో కూరగాయలు అమ్మడం, మటన్ షాపులో మటన్ అమ్మడం వంటి తదితర పనులను తలసాని చేశారు.

నగరంలోని పలు ప్రాంతాలలో స్థానిక నాయకులతో కలసి ఆయన కూలి పనులలో పాల్గొన్నారు. ఇక ఈ కూలీ పనులు చేయడం ద్వారా మంత్రి హరీష్ రావు దాదాపు 9 లక్షలు, కేసీఆర్ తనయుడు ఐటీశాఖ మంత్రివర్యులు కేటీఆర్ దాదాపు 7.5 లక్షలు సంపాదించారు. అయితే అందరి కంటే ఎక్కువ కూలీ సంపాదించి “కూలీ నంబర్ 1”గా తలసాని శ్రీనివాస్ యాదవ్ అవతరించారు.