TRS MLA Missing Sister car found in kakatiya canalసోమవారం నాడు కరీంనగర్ జిల్లా అలగనూర్ కాకతీయ కాల్వలో కారు కొట్టుకొచ్చింది. అందులో మూడు మృతదేహాలు ఉన్నాయి. కాల్వలో కారు, అందులో మృతదేహాలు ఉండటం సంచలనం రేపింది. వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులుగా పోలీసులు గుర్తించడం మరింత సంచలనమైంది.

మృతులను ఎమ్మెల్యే చెల్లెలు రాధిక, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్రలుగా గుర్తించారు. ఇప్పుడు ఈ కేసులో పలు అనుమానాలు వస్తున్నాయి అని ఎన్టీవీలో వచ్చిన ఒక కథనం సూచిస్తుంది. వివరాల్లోకి వెళ్తే… గత నెల 27న రాధిక కుటుంబం కారులో బయటకు వెళ్లారు. 28 నుండి రాధిక కుటుంబం ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి.

అదే రోజున షాపులో పనిచేసే నర్సింగ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చాడట. దానితో అదే రోజు సోదరి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లి వెతికారట ఎమ్మెల్యే. ఆ తరువాత ఏమైందో ఏమో గానీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి, 22 రోజుల పాటు కనీసం పోలీసులకి ఫిర్యాదు కూడా చెయ్యలేదు.

దీనితో ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట స్థానికులు. తన సోదరి కుటుంబం తరుచూ విహార యాత్రలకు వెళ్తుందని, దానితో వారు క్షేమంగానే ఉన్నారని అనుకున్నామని ఎమ్మెల్యే చెబుతున్నారు. అలా అనుకున్నప్పుడు తాళాలు ఎందుకు పగలగొట్టారు? ఎందుకు 22 రోజుల పాటు కబురు లేకపోయినా స్పందించలేదు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.