తెలంగాణాలో ఇటీవలే జరిగిన మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయదుందుభి మోగించింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంకట్రావు సాధించిన అనితరసాధ్యమైన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించి తెరాస రికార్డు సృష్టించింది. మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు.
పూర్తి బాధ్యతలు తనయుడు, మంత్రి కేటీఆర్ కు అప్పగించారు. కేటీఆర్ ఈ ఎన్నికలు తెరాస కార్యనిర్వాహకుడిగా తనకు, తమ ప్రభుత్వానికి రెఫరెండం అని చెప్పి ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించారు. కేటీఆర్ తనను నిరూపించుకోవడంతో ఇక ఆయనకు సీఎం బాధ్యతలు కట్టబెడతారనే ప్రచారం ఊపందుకుంది.
సాధారణంగా కేసీఆర్ కొన్ని నమ్మకాలను విశ్వసిస్తుంటారు. అందుకే ఆయన తెలుగు సంవత్సరం ఉగాది నాటికి మంచి ముహూర్తం చూసి కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగించాలనే యోచనలో ఉన్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తే పార్టీలో ఎలాంటి అసమ్మతి స్వరం వినిపించకుండా కేసీఆర్ ఈ రెండు నెలలు పనిచెయ్యబోతున్నారట.
మరీ ముఖ్యంగా హరీష్ రావు వర్గంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతారట. కేటీఆర్ కు అప్పగించి కేసీఆర్ తెలంగాణ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా ఉంటూ కేటీఆర్ కు పాలనా పరమైన విషయంలో సహకరించనున్నారని పొలిటికల్ సర్కిల్లో వార్త చక్కర్లు కోడుతోంది. అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట.