తెలంగాణాలో టిడిపికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెరాస కండువా కప్పుకోవడానికి సుముఖంగా ఉండగా, అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చానాగేశ్వరరావు తనకు ఆ ఆలోచన లేదని ఇది వరకే చెప్పుకొచ్చారు. అయితే తెరాస నేతలు మంత్రివర్గ విస్తరణ జరిగే లోపు తేల్చుకోవాలని సండ్ర కు చెప్పారట. తెరాసలోకి వెళితే దళిత, ఖమ్మం కోటాలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు సండ్రను ఊరిస్తున్నారట.
అయితే ఇవన్నీ జరగాలంటే టీడీపీ శాసనసభ పక్షాన్ని తెరాస శాసనసభ పక్షంలో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ కు లేఖ ఇవ్వాలని తెరాస వారు కండిషన్ పెట్టారట. అవసరం కోసం తెరాసలోకి మారని తప్పని పరిస్థితి అయితే రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చి, ఈ స్థాయికి తెచ్చిన పార్టీకి ఆ ద్రోహం మాత్రం చెయ్యలేను అంటున్నారంట సండ్ర, అయితే తెరాసలో చేరిక ఆలస్యం అయితే ఓటుకు నోటు కేసు గొడవ మళ్లీ వస్తుందేమోనన్న భయం కూడా ఉందని అంటున్నారు.
దీంతో ముందు కొంత బెట్టు చేసినా టిడిపిని తెరాస లో విలీనం చేయడానికి వీలుగా సండ్ర లేఖ ఇవ్వకతప్పదని సమాచారం. గత శాసనసభలో కూడా ఇలాగే ఆపరేషన్ ఆకర్షతో టీడీపీ శాసనసభ పక్షాన్ని తెరాస శాసనసభ పక్షంలో విలీనం చేసుకుంది అధికార పక్షం. ఈ సారి టీడీపీకి ఇద్దరే శాసనసభ్యులు ఉండటంతో ఆ పని మరి కాస్త తేలిక అయ్యింది. అయితే టీడీపీతో పాటు ఈ సారి కాంగ్రెస్ ను కూడా విలీనం చేసుకోవాలని అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తుంది