Muhurath Confirmed for KCR's Cabinet Expansion?తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి అలకబూనారని వార్తలు వస్తున్నాయి. అధికారులందరి ముందే సీఎం కే చంద్రశేఖరరావు తనను తిట్టారని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన.. సచివాలయం ముఖాన్నే చూడనంటూ బీష్మించుకు కూర్చున్నారు. అసలు విషయానికి వస్తే… ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సచివాలయం తరలింపు సరిగ్గా జరగలేదని ముఖ్యమంత్రి ఆగ్రహించారట.

సచివాలయం తరలింపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులందరి ముందే సీఎస్ జోషి పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జోషి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. సమీక్ష జరుగుతుండగానే ఆయన ముఖ్యమంత్రి ముందే లేచి బయటకు వెళ్ళిపోయారని వార్తలు వచ్చాయి. తన సీనియారిటీకి నిజాయితీకీ అందరి ముందు సీఎం తనను తిట్టారని మనస్తాపం చెందారట.

ఈ నేపథ్యంలోనే పాత సెక్రటేరియట్ ముఖం కూడా చూడబోనని సీఎస్ జోషి.. సహచర ఉద్యోగులతో తెగేసి చెప్పారట. దీనితో ఆయన బూర్గుల రామకృష్ణారావు భవనానికే వస్తానని.. అక్కడ వసతి లేకపోతే ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తానని చీఫ్ సెక్రటరీ స్పష్టం చేశారట. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినా ఆయన చీఫ్ సెక్రటరీ తో పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యలేదని, దీనితో ఆయన మరింత కినుక వహించారని వార్తలు వస్తున్నాయి.