tv9 - ravi prakashఫోర్జరీ, నిధుల దుర్వినియోగం అభియోగాలు ఎదురుకుంటూ అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ లో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఏప్రిల్ 18, 2019న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయని, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ తాను ప్రసారం చేసిన కథనాలకు ప్రతీకారంగా తన మీద ఈ కేసులు పెట్టించారని ఆరోపించారు. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని అందుకే అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారన్నారు.

తనను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ, వ్యాపారపరమైన అజెండా ఉందని ఆరోపించారు. అయితే తన లైవ్ షో విత్ రవి ప్రకాష్ కార్యక్రమంలో కూడా తాను ప్రభుత్వాన్ని గురించి ప్రస్తావించలేదని, వ్యవస్థ వైఫల్యం పైనే ప్రశ్నించానని ఆయన చెప్పారు. దాదాపు 20మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే, తామంతా చూసీచూడనట్టు గుడ్డిగా వ్యవహరించాలా అని రవిప్రకాష్ ప్రశ్నించారు. 2016 నుండి మై హోం రామేశ్వరరావు టీవీ9ను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తమను సంప్రదించారని అయితే ఆయన వెనుక ఉన్న రాజకీయ శక్తులను చూసి దానికి తాము ఒప్పుకోలేదని చెప్పారు.

అదే సమయంలో టీవీ9 తెరాస రాజకీయ ఛానల్ గా ఎలా వాడుకుంటున్నారో కూడా రవి ప్రకాష్ వెల్లడించారు. 2018 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ రైడ్స్ జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, ఆ సమయంలో రేవంత్ రెడ్డి వార్తను ఎలా కవర్ చేయాలో రామేశ్వరరావు కుమారుడు, సోదరుడు డిక్టేట్ చేస్తున్నారని ఫోన్‌ చేసి అమెరికాలో ఉన్న తనకు తన స్టాఫ్ చెప్పినట్లు రవిప్రకాష్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి వారికి రాజకీయ శత్రువు కావడంతో, ఆయనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారు ప్రయత్నించారని రవిప్రకాష్ చెప్పారు.