Trivikram Srinivasమాటలతో మాయచేయవచ్చని తెలుగు ఇండస్ట్రీకి సరికొత్తగా నేర్పిన మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో “అరవింద సమేత వీరరాఘవ” సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ దసరాకు విడుదల టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జూనియర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి అభిమానులను ఫిదా చేసారు. ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ ఎంతగానో ఇష్టపడే యద్దనపూడి సులోచనారాణి ఇటీవల స్వర్గాస్తురలైన సందర్భంగా… ఆమెతోటి అనుబంధాలను పంచుకుంటూ ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు త్రివిక్రమ్.

ఇందులో పవన్ కళ్యాణ్ తో ఉన్న విభేధాల గురించి కూడా ప్రస్తావించారు. “అజ్ఞాతవాసి” సినిమా విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ కు, త్రివిక్రమ్ కు మధ్య దూరం పెరిగిందన్న టాక్ హల్చల్ చేస్తున్న నేపధ్యంలో… అలాంటిదేం లేదని చెప్పిన త్రివిక్రమ్, సినిమాలు ఇద్దరి స్నేహితులను దూరం చేయలేవని స్పష్టం చేసారు. ఇప్పటికీ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటామని, ఇటీవల కూడా ఫోన్ చేసి మాట్లాడానని, పవన్ తో తన సాన్నిహిత్యం అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు అలాగే ఉందని అన్నారు.

“అత్తారింటికి దారేది” సినిమా సూపర్ అయినపుడు నాతో ఎలా ఉన్నారో, “అజ్ఞాతవాసి” తర్వాత కూడా అలాగే ఉన్నారని, అప్పుడేం కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకుని, బహుమానాలు ఇవ్వలేదు, ఇప్పుడు దూరమూ పెట్టలేదు అని పుకార్లను ఖండిస్తూ పవన్ తో అనుబంధాన్ని స్పష్టంగా తెలిపారు. ఇక ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’ అక్టోబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని, జూనియర్ ఎన్టీఆర్ ను కాస్త బొద్దు తగ్గించమని మాత్రమే తాను సలహా ఇచ్చానని, కానీ తారక్ ఏకంగా కండలు పెంచి కనిపించారని, నాలుగు నెలల కష్టం ఫలితం ఇదంటూ తారక్ పై ప్రశంసలు కురిపించారు.