ప్రస్తుతం హీరో హీరోయిన్లంతా తమ గాత్రాన్ని ప్రేక్షకులకు వినిపించే ఆలోచనల్లో ఉన్నారు. ఇందులో తన, మన అన్న తారతమ్యం లేకుండా దాదాపుగా అందరూ ఏదొక సందర్భంలో గొంతును సవరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో చేరింది చెన్నై బ్యూటీ త్రిష.
తెలుగు, తమిళ భాషల్లో హార్రర్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న “నాయకి” సినిమా కోసం త్రిష గొంతు సవరించింది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచినా, ఇప్పటివరకు కనీసం తన సినిమాకు తానూ డబ్బింగ్ కూడా చెప్పని త్రిష, ఇపుడు ఏకంగా ఒక పాటను పాడేయడం విశేషం.
రఘు కుంచె సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ పాటను ఇటీవలే రికార్డ్ చేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఎంతో హుషారుగా కనిపిస్తున్న త్రిష, ఈ పాటను బాగానే ఆలపించినట్లు తెలుస్తోంది. మరి త్రిష స్వరం వినాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. గోవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మామిడిపల్లి గిరిధర్, కందుకూరి రాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.