నిమిషానికి 1.20 వాయిస్ టారిఫ్ అమలులో ఉండగా, ఉచిత కాల్స్ ఆఫర్ ఎలా ఇస్తారంటూ రిలయన్స్ జియోకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) ప్రశ్నాస్త్రాన్ని సంధించి షాకిచ్చింది. రెగ్యులేటరీకి సమర్పించిన రిపోర్టుకు, ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్లకు చాలా తేడా ఉన్న కారణంగా జియోను వివరణ కోరినట్టు ట్రాయ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ట్రాయ్ ఉన్నతాధికారులు రిలయన్స్ జియో ప్రతినిధులతో భేటీ అయి, టారిఫ్ ప్లాన్ వివరాలు, ప్రైసింగ్ మోడల్ తదితరాలపై వివరాలు తెలుసుకుంటున్నారని వివరించాయి.
కాగా, కాల్ ప్లాన్ కింద సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపిన జియో, సిమ్ కార్డు బ్రోచర్ల పైన కూడా ఇదే విషయాన్ని ప్రచురించింది. ఇక ఉచిత కాల్స్ ఆఫర్ కు, ఈ టారిఫ్ ప్లాన్ కు మధ్య వ్యత్యాసంపై జియో సంస్థ ఇప్పటివరకూ స్పందించలేదు. దీనికి సరైన సమాధానం జియో వద్ద లేదని ఇతర టెలికం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఐయూసీ రేటు నిమిషం కాల్ కు 14 పైసలుండగా, అంతకన్నా తక్కువకు జియో కాల్స్ ఎలా అందిస్తుందన్నది ఎయిర్ టెల్, ఐడియా సహా టెల్కోల ప్రశ్న.
ఇదిలా వుండగా, టెలికం రంగంలో రిలయన్స్ జియో సిమ్ల హవా ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ఆ సిమ్ కార్డులు అమ్ముడు పోవడంతో మిగిలిన టెలికం కంపెనీలు పోటీని తట్టుకొని నిలబడడానికి పోటాపోటీగా వినియోగదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ఆఫర్లను ప్రకటించిన ఆసియాలోనే అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్టెల్ తాజాగా మరోసారి తమ వినియోగదారుల ముందుకు పలు ఆఫర్లు తెచ్చింది. మూడు నెలల పాటు అన్ లిమిటెడ్ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఆఫర్ను మొదట ప్రీపెయిడ్ కస్టమర్లకు అందించి, ఆ తరువాత పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు కూడా అందించాలని యోచిస్తోంది. ఈ ఆఫర్ ను పొందాలంటే వినియోగదారులు ఎయిర్ టెల్ క్లౌడ్, ఎయిర్టెల్ డైలర్ అనే రెండు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. కస్టమర్లు ఎయిర్టెల్ క్లౌడ్ డౌన్ లోడ్ తో 2 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్, బ్యాకప్ కూడా పొందవచ్చని చెప్పింది. అంతేకాదు, ఎయిర్ టెల్ డైలర్ ఎయిర్టెల్ నుంచి ఎయిర్ టెల్కి 50 నిమిషాల పాటు ఉచిత కాల్ చేసుకోవచ్చని పేర్కొంది.