సినిమారంగ ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని, కరోనా ప్రబలకుండా సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు.
దీనిని టాలీవుడ్ పెద్దలు స్వాగతించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు మాత్రం ఈ పరిణామాలపై ఆనందంగా లేరు. ఇండస్ట్రీ సమస్యల మీద టాలీవుడ్ పెద్దలు కేసీఆర్ ని కలుస్తున్నారు, జగన్ ను మాత్రం కలవడం లేదు. “నిన్న గాక మొన్న… ఇండస్ట్రీ కోసం సింగల్ విండో సిస్టం తెచ్చారు. షూటింగుల రుసుములు తగ్గించారు. కనీసం థాంక్స్ చెప్పిన వాడు కూడా లేదు,” అని వారి ఆగ్రహం.
“ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే కేంద్రీకృతం అయ్యి ఉంది. అయితే చాలా సినిమాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా షూటింగ్ జరుపుకుంటాయి. వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ అవసరం లేదా? ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చెయ్యడం లేదు?, ” అంటూ వారు ఘాటుగానే స్పందిస్తున్నారు.
షూటింగులు అనుమతించకపోతే వారి తిక్క కుదురుతుందని జగన్ కు సలహా ఇస్తున్నారు. అయితే పరిశ్రమలో మాత్రం తెలంగాణ విషయంలో ఒక క్లారిటీ వచ్చాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించాలని అనుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో జగన్ అటువంటి భేషజాలు ఉండవనే వారు అనుకుంటున్నారు.