Chiranjeevi - Ram Charanప్రకృతి ప్రకోపానికి అతలాకుతలం అయిన కేరళను ఆదుకునేందుకు తెలుగు సినీ హీరోలు నడుం కట్టారు. ముందుగా విజయ్ దేవరకొండ 5 లక్షలతో దీనిని ప్రారంభించగా, తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 25 లక్షల ప్రకటన వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది. చిరంజీవి ఫ్యామిలీ నుండి అత్యధికంగా 61 లక్షల ప్రకటన వచ్చింది. చిరు, చెర్రీలు చెరో 25 లక్షలు, ఉపాసన 10 లక్షలు, చిరు తల్లి గారు 1 లక్ష రూపాయలతో మొత్తంగా 61 లక్షలకు ప్రకటన వెలువడింది.

ఆ తర్వాత నందమూరి బ్రదర్స్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు, కళ్యాణ్ రామ్ 10 లక్షలతో మొత్తంగా 35 లక్షలకు ప్రకటన వెలువడింది. అలాగే నాగార్జున ఫ్యామిలీ నుండి 28 లక్షలు రాగా, ప్రిన్స్ మహేష్ బాబు నుండి 25 లక్షలు అందిస్తున్నట్లుగా తెలిపారు. 25 లక్షలు ప్రకటించిన జాబితాలో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉండగా, వరుణ్ తేజ్ 10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. హీరో రామ్ 5 లక్షలు, దర్శకుడు కొరటాల శివ 3 లక్షలు ప్రకటించారు.

మొత్తంగా ఇప్పటికీ టాలీవుడ్ నుండి 2 కోట్లు పైనే ప్రకటనలు రాగా, ఇంకా రావాల్సిన పెద్ద కుటుంబాలు ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ నుండి ప్రకటన రావాల్సి ఉండగా, బాలయ్య ఇండస్ట్రీ తరపున ప్రకటిస్తారో, పార్టీ తరపున అందిస్తారో చూడాలి. అలాగే కష్టాలకు కరిగిపోతాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీ తరపున గానీ, పార్టీ తరపున గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. లేటుగా అయినా కాస్త పెద్ద మొత్తాన్ని పవన్ అందిస్తారని టాక్.