జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి క్రమంగా పెరుగుతూ పోతోంది. సరళతర వాణిజ్యానికి దేశంలోనే నంబర్ వన్ గా ఇటీవల వార్తల్లోకి ఎక్కిన ఏపీ ఇప్పుడు సుఖమయ జీవనానికి కూడా తనే బెస్ట్ అని తేలింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లోని టాప్-10 నగరాల్లో ఏపీ నుంచి రెండు నగరాలు తిరుపతి, విజయవాడలకు స్థానం లభించింది. ఈ ఎంపిక కోసం మొత్తం నాలుగు సూచీలను ప్రాతిపదికగా తీసుకున్నారు.
ఒక సూచీలో తిరుపతికి మరో విశిష్ట నగరంగానూ గుర్తింపు లభించి, దేశంలోనే అత్యున్నత నగరంగా ఎంపికైంది. రెండు సూచీల్లో విశాఖపట్టణానికి పదో స్థానం దక్కింది. ఓవరాల్ గా 64వ స్థానంలో నిలిచింది. ఇక తీర నగరం కాకినాడకు 17వ స్థానం దక్కింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖా మంత్రి హర్దీప్సింగ్ పూరి తమ డ్యాష్ బోర్డు ద్వారా సోమవారం ఈ జాబితాను విడుదల చేశారు.
సుఖమయ జీవన నగరాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణానికి ర్యాంకులు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. జాతీయస్థాయిలో ఏపీ నగరాలు ముందు వరుసలో నిలవడం ఆయా నగరాల ప్రజలకు, అధికారులకు గర్వకారణమన్నారు. సీఎం మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ అన్నారు.