ఒకప్పటి ప్రేమికులు, ప్రస్తుత బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ దాదాపు నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ సినిమా కోసం కలవనున్నారు. ఇటీవలే విడుదలైన ‘సుల్తాన్’ సినిమాతో మాంచి విజయాన్ని సల్మాన్ తన ఖాతాలో వేసుకోగా, మరోవైపు ‘బార్ బార్ దేఖో’ సినిమాలో కత్రినా చూపిన బికినీ అందాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరూ చివరిసారిగా 2012లో విడుదలైన ‘ఏక్ థా టైగర్’ చిత్రంలో కలిసి నటించారు.
ప్రస్తుతం అదే సినిమాకు సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సుల్తాన్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు స్వీకరించాడు. బక్రీద్ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా పోస్టర్ను విడుదల చేస్తూ తనకు ఓ వైపు భయంగాను, మరో వైపు ఉత్సాహంగాను ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓ ఇండియన్ ఏజెంట్, పాకిస్థానీ గూఢచారి కలిసి ఒక శత్రువును ఎదురిస్తున్నట్లుగా సినిమా పోస్టర్ ఉండగా, 2017 క్రిస్మస్ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.