అమరావతిని ఒక కులానికి అంటగట్టి అదేదో వేరే దేశంలో ఉన్న ప్రదేశం అన్నట్టు మిగతా వారిని భయపెట్టడంలో ఒక వర్గం చేసిన ప్రయత్నం ఫలించినట్టుగానే కనపడుతుంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండొచ్చు అని ప్రకటించారు. దీనిని అభివృద్ధి వికేంద్రీకరణ కోసమంటూ సమర్ధించుకున్నారు.
ఈ విషయం పై ప్రతిపక్షం మాట్లాడకుండా తెలివిగా శాసనసభ సమావేశాల చివరి నిముషాలలో ప్రకటన చేసి వెంటనే సభని నిరవధికంగా వాయిదా వేసుకుని వెళ్ళిపోయింది ప్రభుత్వం. ఈ నిర్ణయం వల్ల ఆయా ప్రాంతాలకు ఎంత మేలు జరుగుతుందో చెప్పలేం గానీ అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం పూర్తిగా మునిగిపోయారు.
ఈ తాజా ప్రతిపాదన వల్ల రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం రాజధాని ప్రాంతం మందడంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భూములిచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జై విశాఖ అంటూ ఓ వ్యక్తి నినాదాలు చెయ్యడం ఉద్రిక్తత నెలకొంది.
అతని మీదకు రైతులు దూసుకెళ్లడంతో పోలీసులు కలగజేసుకోవాల్సి వచ్చింది. నినాదాలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషనుకు తరలించారు. ఇప్పటికే ప్రాంతీయ విభేదాలతో ఒకసారి విభజన జరిగింది. ఇప్పుడు ఏమీ లేకుండానే విబేధాలు వచ్చేశాయి. ఇది ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.