తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, అయితే వాటికి బెదిరిపోయే వ్యక్తిని తాను కానని తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. తాను కొత్త పార్టీ పెట్టే తీరుతానని, ఏ ఇతర పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేసారు. తమిళనాడులో ఈ ఏడాది నవంబర్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని కమల్ భావిస్తున్నట్లుగా పొలిటికల్ టాక్. దేశంలో మార్పు అవసరమని ఆ మార్పు తనతోనే, తమిళనాడు నుంచే రావాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.
ప్రతి పార్టీకీ ఒక సిద్ధాంతం ఉంటుందని, తన జీవితంలో చాలా మంది రాజకీయ పార్టీల నేతలను కలుసుకున్నానని, వారితో ఫోటోలు దిగానని, అయినప్పటికీ తాను ఏ పార్టీ సిద్ధాంతాలకు లోబడలేదని చెప్పారు. తన ఆశయాలు, ఆలోచనలకు అనువుగా ఏ ఒక్క పార్టీ ఉన్నట్లుగా తనకు అనిపించలేదని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను బహిష్కరించడం అనేది ఒక మంచి పరిణామమని అన్నారు. దేశంలో రాజకీయ వ్యవస్థ దెబ్బతిందని, దానిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు కమల్.
“ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాకుండా, నాయకులు ఓట్ల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వెంటనే వారిని తొలగించగలిగే రాజకీయ వ్యవస్థ మనకు కావాలి” అన్నారు. భారత రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలంటే తాను చెబుతోన్న ఐడియానే మంచి మార్గమని హితవు పలికారు. కమల్ వామపక్ష పార్టీలోకి చేరుతున్నారంటూ బిజెపి నేత స్వామి చేసిన ఆరోపణల నేపధ్యంలో… వాటిని ఖండిస్తూ, తనది కొత్త పార్టీ, కొత్త ఎజెండా అంటూ ‘లోకనాయకుడు’ కమల్ స్పష్టం చేసారు.