అత్యధిక మెజారిటీ తో జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 33 నెలలు అయ్యింది ఎన్నికలకు ఇంకా 27 నెలల కాలం మిగిలి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎన్నికల ముందు నాటి వాతావరణం కనిపిస్తుంది. ఏ అంశం చూసినా ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది.
సంక్షేమ కార్యక్రమాల మోజులో జగన్ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చెయ్యడంతో చాలా వార్గాలు ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నాయి. మరోవైపు అప్పులు గణనీయంగా పెరిగి రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది. అలా అని పేదలు పూర్తిగా సంతోషంగా ఉన్నారా అంటే అది కూడా లేదు.
నిర్మాణ రంగం కుదేలు కావడం, పనులు దొరక్కపోవడం, కరోనా, ధరలు విపరీతంగా పెరిగిపోవడం వంటి అనేక కారణాలతో ఆ వర్గం కూడా పూర్తిగా హ్యాపీగా లేదు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల ముందుకు వచ్చిన జగన్ పూర్తిగా నిరాశపరిచాడు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే కొన్ని వర్గాలు చంద్రబాబు లాంటి దార్శనికుడిని వదిలేసి తప్పు చేశాం అనే భావనకు వచ్చేశాయి. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఓపెన్ హార్ట్ వంటి కార్యక్రమానికి వచ్చి ప్రజలతో సూటిగా మాట్లాడితే… ప్రజలు తాము ఏం కోల్పోయామో… ప్రస్తుత ముఖ్యమంత్రిలో ఏం లేదో తెలుసుకునే అవకాశం ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తే మంచిది. ఎన్నికలు లేని సమయంలో అటువంటి ప్రయత్నం చేస్తే ప్రజల మైండ్ కూడా ఓపెన్ గా ఉండే అవకాశం ఉంటుంది. కరోనా కారణంగా ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు కాబట్టి అటువంటిది ఇప్పుడు బాగా ఉపయోగపడొచ్చు.