ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. అప్పట్లో ఎన్నికల సమయంలో తమ క్యాడర్, నాయకుల పై హింస నిరసనగా టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.
అయితే అధిష్టానం మాట కాదని కొందరు నాయకులు పోటీకి దిగారు. అయితే చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె.. అలాగే ఆయనకు చెందిన కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేవు.
టీడీపీ… చంద్రబాబు పని అయిపోయినట్టే అని వచ్చే ఎన్నికలలో ఆయన ఓటమి కూడా తధ్యమని వారు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా… టీడీపీ కూడా కడప ఎమ్మెల్సీ గెలిచింది. పైగా జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని ఓడించి గెలిచింది టీడీపీ అప్పట్లో.
కడప ఎంపీ సీటు మాదే అని… ముఖ్యమంత్రి జగన్ సొంత సీటు పులివెందుల మాదే అని ఎక్కడా ఆగేవారు కాదు. కట్ చేస్తే ఎన్నికలలో ఘోర పరాజయం. కడపలో అయితే అకౌంట్ కూడా ఓపెన్ చెయ్యలేదు. స్థానిక ఎన్నికలు, ఉపఎన్నికలలో అధికార పార్టీ వైపు మొగ్గు ఉండటం సర్వసాధారణం… దానికి సంబరపడొచ్చు గానీ తమకు ఎదురే లేదు అని ఏ పార్టీ అయినా అనుకుంటే అది వారికే ఆ తరువాతి కాలంలో ఇబ్బంది.