Alla -Ramakrishna -Reddyచంద్రబాబు అధికారంలో ఉండగా అనేక కేసులతో అప్పటి ప్రభుత్వానికి ఇరుకున పెట్టే ప్రయత్నం చేసేవారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఆ తరువాత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ ని ఓడించి జైంట్ కిల్లర్ గా అవతరించారు ఆయన. గెలిచాకా చంద్రబాబు ఉండవల్లి ఇంటిని కూలగొట్టాలని పోరాటం చేస్తున్నారు.

అటువంటి ఆళ్ల రామకృష్ణ రెడ్డికి ఝలక్ తగిలింది. మంగళగిరి ఆయన ఆఫీసులో 10 లక్షల చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఆ డబ్బును ఆఫీసులో ఉంచినట్లు తెలుస్తోంది.

డబ్బు చోరీపై వైఎస్సార్‌సీపీ నేత జూపూడి జాన్సన్‌ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. కంప్లయింట్ తో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆఫీసులో పని చేసే వారి పనేనా అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు.

ఈ క్రమంలో అనుమాతుడిగా గుర్తించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని నుంచి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. తొందరలోనే దొంగను పట్టుకుని పోయిన సొమ్ముని రికవర్ చేస్తామని అంటున్నారు. అయితే రాష్ట్రంలో పోలీసులను ప్రతిపక్ష నేతల పై దొంగ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తుండడంతో ఎమ్మెల్యేలకు కూడా భద్రత లేకుండా పోయిందని టీడీపీ వారు ఆక్షేపిస్తున్నారు.