భారతి సిమెంట్స్ లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో చేర్చడాన్ని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. భారతి సిమెంట్స్ పెట్టుబడుల విషయంలో అంతా సవ్యంగా ఉన్నప్పటికీ భారతిరెడ్డి పేరును చార్జిషీట్ లో చేర్చడమంటే దురుద్దేశపూర్వకంగా సాగిందని తమ్మినేని సీతారాం తప్పుబట్టారు.
భారతి సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి చట్టబద్దం కానిది ఏముందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పాల్సిన అవసరముందని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఇది కొంత హాస్యాస్పదంగా ఉంది. చట్టబద్ధం కానిది ఏముందో ఇప్పటికే ఈడీ ఛార్జ్ షీటులో చెప్పే ఉంటుంది. దానిని వాదనల సందర్భంగా రుజువు చెయ్యాల్సి ఉంది.
మరో వైపు రాజకీయ దురుద్దేశంతో జగన్ మోహన్ రెడ్డిపై అనేక కేసులు దాఖలుకాగా ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన భార్య భారతీ రెడ్డి పేరు చార్జిషీటులో చేర్చాల్సిన అవసరమేమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజలను తప్పు దారి పట్టించే వ్యాఖ్య… గతంలో జగన్ కేసులలో సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది వాటిని తిరిగి విచారించి ఈడీ ఛార్జ్ షీట్లు వేస్తుంది.
ఇప్పటికి 11 ఛార్జ్ షీట్లు వేశారు. మరి కొన్ని వేస్తారు. దానికి ఏడేళ్ళ తరువాత వెయ్యడమేంటీ అని అడగం ప్రజలను తప్పు దారి పట్టించడమే. ఇవన్నీ పక్కన పెట్టి అసలు వైకాపా ఈ విషయంలో రాజకీయ దురుదేశమని ఆరోపణలు చెయ్యాలో లేక యెల్లో మీడియాను నిందించాలో ముందుగా నిర్ణయించుకోవాలి.