ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షల నిర్వహణ రాజకీయంగా ప్రెస్టీజియస్ గా మారింది. దేశవ్యాప్తంగా పరీక్షలు ఇప్పటికే రద్దు చేస్తే… ఏపీలో మాత్రం జులై 26నుంచి ఆగస్టు 2వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు చేస్తుంది విద్యాశాఖ. పరీక్షలకి 6.28 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నరని.. 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని…. 11 పేపర్ల బదులు 7 పేపర్లకి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చినవీరభద్రుడు నిన్న చెప్పుకొచ్చారు.
దీనిపై ఈ రోజు ముఖ్యమంత్రి సమక్షంలో తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉండగా… చివరి నిముషంలో సుప్రీం కోర్టు ప్రభుత్వం స్పీడ్ కి బ్రేక్ వేసింది. కరోనా వైరస్ ఉధృతిలోనూ పరీక్షలను రద్దు చేయటం లేదంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్షలు రద్దు చేయని ఏపీ సర్కార్ సహ నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
దానితో పరీక్షల నిర్వహణపై కీలక సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి తుదినిర్ణయం మాత్రం తీసుకోలేదు. సుప్రీం కోర్టులో ఏం జరగబోతుంది అనేది చూసి ఒక నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఇబ్బంది రాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారట. 18 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలు రద్దు చేయగా, ఏపీ పంజాబ్ అస్సాం రాష్ట్రాలు పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పరీక్షలు రద్దు చెయ్యాలని ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా టీడీపీ తరపున నారా లోకేష్ గట్టిగా పోరాడటంతో పరీక్షలు ఎలాగైనా జరిపి తీరాలని ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు. గతంలో ఒకసారి ఈ విధంగానే హైకోర్టు అడ్డుపుల్ల వేసింది. కరోనా సమయంలో పిల్లలను, టీచర్లను రిస్క్ లో పెట్టే కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం పట్టూవిడుపూ ప్రదర్శిస్తే మంచిది.