స్కోరు బోర్డు పైకి అకస్మాత్తుగా ఉడుము వచ్చిన ఘటన ఫ్లోరిడాలో జరుగుతోన్న మియామి ఓపెన్ లో ఈ రోజు చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఓ ఉడుము దర్శనమివ్వడంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న ఆ మ్యాచ్ కొద్దిసేపు వాయిదా పడింది. పురుషుల సింగిల్స్ లో భాగంగా టామీ హాస్ (జర్మనీ)తో వెస్లి (చెక్) పోటీ పడుతూ ఇద్దరూ చెరో సెట్ గెలిచి మూడో సెట్ లో పోరాడుతున్నారు.
అయితే స్కోరు బోర్డు పైకి ఒక్కసారిగా ఉడుము రావడంతో మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు. దీంతో అక్కడి అభిమానులు తమ స్మార్ట్ ఫోన్లు, కెమెరాలతో ఆ ఉడుముతో సెల్ఫీలు, ఫోటోలను తీసుకుని, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఉడుము అక్కడి నుంచి వెంటనే వెళ్లకపోవడంతో కోర్టు సిబ్బంది దాన్ని పంపించేందుకు యత్నించారు.
ఈ క్రమంలో అది టెన్నిస్ కోర్టులోకి ప్రవేశించి అక్కడే అటూ ఇటూ తిరిగి హల్చల్ చేసింది. అనంతరం ఎలాగోలా దాన్ని పట్టుకున్న సిబ్బంది దాన్ని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. తర్వాత మ్యాచ్ కొనసాగగా, చివరి సెట్ను కైవసం చేసుకున్న వెస్లీ 6-7, 6-3, 7-5తో మ్యాచ్లో విజేతగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో క్రీడాకారుల కంటే ఉడుము సృష్టించిన హంగామానే హైలైట్ అయ్యింది.