తమ పార్టీని బలోపేతం చేసుకోవడం, ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయడమే ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష ఇప్పుడు బెడిసికొట్టేలా కనిపిస్తుంది. పలు నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి నేతలు ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. వీరిలో పలువురు ఇతర పార్టీలకు చెందిన సిటింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరికొంతమంది క్యూలో ఉన్నారు.
అయితే అందరిలోనూ అయోమయం ఫైనల్ గా ఎవరికీ టికెట్ దొరుకుతుందో అని. కార్యకర్తల్లో కూడా అయోమయానికి దారితీసి అక్కడక్కడా గొడవలు కూడా జరుగుతున్నాయి. సిటింగ్లు అందరికీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే భరోసా ఇచ్చారు. అయితే, కొన్నిచోట్ల సిటింగ్లకు టికెట్లు ఇస్తే, పార్టీ కోసం పని చేసిన నేతలకు న్యాయం జరగదు.
మరికొన్నిచోట్ల సిటింగ్లకు టికెట్లు ఇస్తే పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని సర్దుబాటు చేయడం కుదరదు. ఈ క్రమంలో సర్వత్రా అయోమయం నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే సొంత పార్టీలలో ముసలం వల్ల వచ్చే ఎలక్షన్ లో నష్టపోయే పరిస్థితి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే ఎవరు పోటీలో నిలిచినా కేసీఆర్ నా బొమ్మతోనే గెలిపిస్తా అని ధైర్యంగా ఉన్నారట. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే అందరినీ సర్దుబాటు చేయవచ్చని, ఎలాంటి ఇబ్బంది ఉండదని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. అది ఉంటుందో ఉండదో తెలిస్తే తదుపరి కార్యాచరణ ప్లాన్ చేస్కుకోవచ్చని ఆయన ప్లాన్. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి!