ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వాహనాలను అడ్డగోలుగా నడుపుతూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలను సవరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలకు పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇక మునుపటిలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్‌ ను ఏళ్ల పాటు రద్దు చేస్తారు.

ఇక పాయింట్ల విషయానికొస్తే… ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి సారీ వాహనదారుడి ఖాతాలో పాయింట్లు నమోదవుతుంటాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఒకటి, సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే రెండు, అలాగే రాంగ్ రూట్‌లో వెళ్తే రెండు… ఇలా ప్రతి అతిక్రమణకు కొన్ని పాయింట్లు ఇస్తారు. ఇవి రెండేళ్ల కాలంలో 12 దాటితే వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ ను ఏడాది పాటు రద్దు చేస్తారు. ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే ఈ సారి రెండేళ్ల పాటు లైసెన్స్ ను రద్దు చేస్తారు.

ఇలా ప్రతి ఏడాది రద్దు పెరుగుతూ పోతుంది. లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారు దాని చెల్లుబాటు వ్యవధిలో 5 పెనాల్టీ పాయింట్లు కనుక ఎదుర్కొంటే లైసెన్స్ రద్దయిపోతుంది. ఫలితంగా మరో మారు లెర్నర్స్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది తొలిసారని రవాణాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనాలు నడిపి, యాక్సిడెంట్ లు జరుపుతుండడంతో, మద్యం తాగి వాహనం నడిపితే అత్యధికంగా 5 పాయింట్లు సదరు లైసెన్స్ దారుడి ఖాతాలో పడనున్నాయి.